టాలీవుడ్లో వున్న క్రేజీ డైరెక్టర్లలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒకరు. ఆయనతో సినిమాలు చేయాలని భారీ నిర్మాణ సంస్థలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాయి. అలా ఎదురుచూస్తున్న సంస్థల్లో మైత్రీ మూవీమేకర్స్ ఒకటి. తాజాగా ఆయనకు భారీ రెమ్యునరేషన్ను ఆఫర్ చేసిన మైత్రీ సంస్థ ఇందు కోసం భారీ మొత్తంలో కొరటాలకు తదుపరి చిత్రం కోసం అడ్వాన్స్ని అందించినట్టు తెలిసింది. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రారంభానికి ముందు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 30 శాతం చిత్రీకరించాల్సి వుంది. కరోనా కారణంగా ఇప్పట్లో షూటింగ్ ప్రారంభించే పరిస్థితులు కనిపించడం లేదు. చరంజీవి కూడా షూటింగ్ ప్రారంభించడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో మైత్రీ వారితో సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ద్వీతీయార్థంలో మైత్రీ మూవీమేకర్స్కు కొరటాల శివ సినిమా చేయనున్నారట.
మైత్రీ మూవీమేకర్స్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో `పుష్ప` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ `ఉప్పెన`ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో పాటు రీసెంట్గా సూపర్స్టార్ మహేష్తో `సర్కారు వారి పాట` చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.