కలెక్షన్ కింగ్ మోహన్బాబు `మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా తరువాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. తమిళంలో హీరో సూర్య నటిస్తున్న `సూరారై పోట్రు` చిత్రంలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ సినిమా తప్ప ఆయన మరో చిత్రాన్ని అంగీకరించలేదు. ఏపీ ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ పార్టీలో చేరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందు తిరుపతిలోని తన విద్యాసంస్థలైన శ్రీ విద్యానికేతన్లో చటదువుతున్న పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం లేదని, కావాలనే చంద్రబాబు నాయుడు తన స్కూల్లో చదివే పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ని మంజూరు చేయడం లేదని ధర్నాకు దిగి సంచలనం సృష్టించారు. ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రాజకీయలపై స్పందించడం మానేశారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని సోమవారం కుటుంబం సమేతంగా మోహన్బాబు కలవడం. ఆయనతో 45 నిమిషాల పాటు చర్చలు జరపడం సంచలనంగా మారింది.
మోహన్బాబు బీజేపీలో చేరబోతున్నారా? అందుకే ప్రత్యేకంగా తనయుడు మంచు విష్ణుతో కలిసి ప్రధానిని కలిశారా? అని వార్తలు వినిపిస్తున్నాయి. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ అనంతరం మోహన్బాబును ప్రధాని మోదీ తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం 6:30 గంలకు బీజేపీ జాతీయధ్యక్షుడు, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాని మోహన్ బాబు కలవనున్నారట. దీంతో మోహన్బాబు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.