కరోనా క్రైసిస్ అన్ని రంగాలని భారీగా ప్రభావితం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా జనజీవితం స్థంభించడం తో అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీంతో స్టార్స్తో నిర్మించే సినిమాల బడ్జెట్ని ముందు అనుకున్న దాని ప్రకారం కాకుండా తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. కొంత మంది నిర్మాతలు ముందు అనుకున్న బడ్జెట్ని తగ్గించి డైరెక్షన్ టీమ్కి హాఫ్ సాలరీస్ ఇవ్వాలనుకుంటున్నారట.
ఈ జాబితాలో బాలకష్ణ సినిమా కూడా చేరినట్టు తెలిసింది. బాలకృష్ణ, బోయపాటి కలయికలో ముచ్చటగా మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 70 నుంచి 80 కోట్లు బడ్జెట్ వుండాలని ప్లాన్ చేశారట. అయితే కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఈ బడ్జెట్ లో మార్పులు జరిగే అవకాశం వుందని తెలుస్తోంది. ఇటీవలు దర్శకుడు బోయపాటిని బడ్జెట్ విషయంలో ఆలోచించాల్సిందిగా నిర్మాత కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రానికి నిర్మాత 40 కోట్లని మాత్రమే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత అనూహ్యంగా బడ్జెట్ లిమిటేషన్స్ పెట్టడంతో బోయపాటి అందుకు అనుగుణంగానే షూటింగ్ చేయాలని తన ప్లాన్ను మార్చుకుంటున్నట్టు తెలిసింది. అమలాపాల్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారు.