రాష్ట్ర వైద్యారోగ్య శాఖను తన నుంచి సీఎం కేసీఆర్కు బదిలీ చేయడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మెరుగైన సేవలు అందించేందుకు ఆ శాఖను తన నుంచి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉందని, ఏ మంత్రినైనా తొలగించే అధికారం ఆయనకు ఉందన్నారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు తాను తోడుగా వుంటానని ఈటల స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు పథకం ప్రకారమే తనపై దాడి జరుగుతోందని ఈటల ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద ఎకరాలు ఆక్రమించి షెడ్లు కట్టినట్టు చెబుతున్నారని, వాస్తవాలన్నీ బయటకు రావాలని కోరుతున్నట్టు చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రజలే అసహ్యించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్తో ఇప్పటి వరకు మాట్లాడే ప్రయత్నం చేయలేదని.. ఇకపై చేయబోనని ఈటల స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు, శ్రేణులతో చర్చించి తర్వాతే మాట్లాడతానని వెల్లడించారు. ఇదిలా వుంటే 20 ఏళ్ల ఉద్యమ బంధానికి అవినీత మచ్చని ఆపాదిస్తున్నారని, ఈటల మచ్చలేని నాయకుడని ఆయన వర్గం నిప్పులు కురిపిస్తున్నారు.