మెగాస్టార్ చిరంజీవి రిస్క్ చేయబోతున్నారా?.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విళయతాండవం సృష్టిస్తున్న వేళ సినిమా కోసం రిస్క్ చేయబోతున్నారా? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై హీరో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
40 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో కీలక షెడ్యూల్ ప్రారంభించాలనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ ఇండియాలో విస్తరించడం మొదలైంది. దీంతో లాక్డౌన్ అమల్లోకి రావడం, జనజీవితం స్థంభించిపోవడం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. అన్ని సినిమాలతో పాటే `ఆచార్య` చిత్రీకరణ కూడా ఆగిపోయింది. లాక్డౌన్ సడలించిన తరువాత నుంచి షూటింగ్లకు అనుమతులు మంజూరు చేసినా కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, రోజు రోజుకీ ప్రమాదకర స్థాయిలో కరోనా సోకిన వారు పెరిగిపోతుండటంతో స్టార్ హీరోలు సినిమా షూటింగ్లు మొదలుపెట్టాలంటే భయపడుతున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మాత్రం `ఆచార్య` కోసం రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది నటీనటులు లేని సన్నివేశాల్ని ముందు పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ హీరో చిరంజీవిని ఒప్పించినట్టు తెలిసింది. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో టెంపుల్ సెట్ని నిర్మిస్తున్నారట. సెట్ పూర్తయితే ఆగస్టు రెండవ వారంలో `ఆచార్య` షూట్ ప్రారంభం అవుతుందట. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి సమయంలో రిస్క్ వద్దు బాస్ అంటూ చిరుని రిక్వెస్ట్ చేస్తున్నారట.