మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎండోమెంట్ అధికారిగా అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా చిరంజీవి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ని నిరవధికంగా వాయిదా వేశారు.
ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి షూటింగ్ పునః ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో టెంపుల్ సెట్ని కూడా నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి మీసం, గడ్డం తీసేసి క్లీన్ షేవ్తో కొత్త లుక్ ని షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. చిరు మేకోవర్ ఏ సినిమా కోసం?.. `లూసీఫర్` కోసమా? అయితే `ఆచార్య` పరిస్థితేంటీ?.. ఆచర్య కోసమే అయితే చిరు ఇందులో మరింత యంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
గత మూడున్న నెలలుగా షూటింగ్కు దూరమైన చిరు ఆచార్య లుక్ని కోల్పోయారా? .. అందుకే చిరు మళ్లీ ఆ లుక్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారా? అనే అనుమానాలు ఫ్యాన్స్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎలాంటి కామెంట్ చేయకుండా చిరు క్లీన్ షేవ్తో కనిపిస్తున్న తన ఫొటోని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. ఇప్పడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.