ఏడు నెలల విరామం తరువాత మళ్లీ టాలీవుడ్ లో సినిమా షూటింగ్ల సందడి మొదలైంది. మీడియం రేంజ్ సినిమాల నుంచి స్టార్ హీరోల చిత్రాల వరకు క్రమ క్రమంగా సెట్ పైకి రావడం మొదలైంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. కానీ సీనియర్ హీరోల చిత్రాలు మాత్రం ఇంకా సెట్లోకి రాలేదు. ఈ జాబితాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న `నారప్ప`, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య`తో పాటు బాలకృష్ణ – బోయపాటి కలయికలో రానున్న సినిమా కూడా వుంది.
ఈ ముగ్గురు హీరోలు అరవై రీచ్ అయిన వారే. వెంకటేష్ కు 59 ఏళ్లు కాగా నందమూరి బాలకృష్ణకు 60 ఏళ్లు. ఇక మెగాస్టార్ చిరంజీవికి 65 ఏళ్లు. ఈ కారణం వల్లే వీరు సినిమా షూటింగ్లకు రావడానికి భయపడుతున్నారట. ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే తాజా గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ మహానగరాన్ని వర్షాలు.. వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దీని కారణంగానే ఈ ముగ్గురు హీరోలు తమ షూటింగ్లని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.
గత వారం `నారప్ప` కోసం సెట్లోకి వెళ్లాల్సిన వెంకటేష్ పరిస్థితులు కుదుటపడిన తరువాతే షూటింగ్ చేద్దామని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు చెప్పినట్టు తెలిసింది. ఇక ఇదేనెలలో పునః ప్రారంభం కావాల్సిన బాలయ్య – బోయపాటి సినిమా కూడా కరోనా భయంతో వచ్చేనెలకు వాయిదా పడినట్టు తెలిసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` షూటింగ్ని కూడా దసరా నుంచి మొదలుపెట్టాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరీస్థితుల దృష్ట్యా ఆ ప్లాన్ ని మార్చినట్టు టాక్. నవబంర్ లేదా డిసెంబర్లో షూటింగ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారట.