మలయాళ హిట్ ఫిల్మ్ `దృశ్యం2`తో మళ్లీ వెలుగులోకి వచ్చింది మీనా. దీంతో ఆమెకి ఆఫర్లు వరుస కడుతున్నాయి. తాజాగా కలెక్షన్కింగ్ మోహన్బాబు తన చిత్రంలో నటించే అవకాశాన్ని మీనాకు ఇచ్చినట్టు తెలిసింది. మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దేశ భక్తి ప్రధానంగా సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో పవర్ఫుల్ స్టోరీతో ఈ చిత్రాన్ని ఓ సెటైరికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హీరో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్ బాబుకు వైఫ్గా మీనా కీలక పాత్రలో నటించనుందని తెలిసింది.
వీరిద్దరూ కలిసి `అల్లరి మొగుడు` వంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బలమైన సామాజిక సందేశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
‘మాస్ట్రో’ ఇలయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఇటీవలే ఓ గద్యానికి బాణీలు కట్టాలని మోహన్బాబు అడుగుతున్న వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. హీరో మంచు విష్ణు భార్య విరానికా ఈ చిత్రానికి స్టైలిస్ట్గా వర్క్ చేస్తున్నారు.