మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ మోషన్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. మోషన్ పోస్టర్ తన కాన్సెప్ట్కు దగ్గరగా వుందని యువ రచయిత కన్నెగంటి అనిల్ కృష్ణ `ఆచార్య` టీమ్పై ఆరోపణలు చేశారు.
తాజాగా రాజేష్ మండూరి అనే రచయిత కూడా కథ తనదే అంటూ మీడియాకెక్కడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మీడియాకు ఓ లెటర్ని రిలీజ్ చేసింది. తమ సినిమా కథ ఎవరి నుంచో కాపీ కొట్టింది కాదని క్లారిటీ ఇచ్చింది. తమ కథను కాపీ కొట్టారంటూ వస్తున్న ఆరోపణలని తీవ్రంగా ఖండించింది. అవన్నీ వట్టి మాటలేనని కొట్టిపారేసింది. `ఆచార్య` కథ ముమ్మాటికీ మా దర్శకుడు కొరటాల శివ రాసిన కథే అని స్పష్టం చేసింది.
ఈ చిత్ర కథపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఖండించింది. కాగా ఈ చిత్రంలోని కీలక పాత్రలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ నటించనున్నారు. ఆయన పాత్ర సినిమాకి కీలకంగా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ ని నిలిపి వేసిన విషయం తెలిసిందే త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుందని తెలిసింది.