హీరోలు అన్నాక తెరమీద బోలెడన్ని విన్యాసాలు చేస్తారు. ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి ఏవేవో చేస్తారు. వాటికి ఫ్యాన్స్ కూడా ఆనందించి తమ హీరో అంటే విపరీతమైన అభిమానం పెంచుకుంటారు. అయితే మనకు నిజ జీవితంలో కష్టం ఎదురైనప్పుడు స్పందించి సాయం చేసేవాడే నిజమైన హీరో అవుతాడు. ప్రస్తుతం ఆ పని చేస్తోన్న మంచు మనోజ్ నిజమైన హీరో.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దీని వ్యాప్తి భారతదేశంలో అంతలా ఉండదు అనుకున్నారు కానీ ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 120కి చేరుకోవడంతో ప్రభుత్వం ఈ వైరస్ ను కట్టడి చేయడానికి నడుం బిగించింది. ప్రజలు ఏమేం చేయాలో అన్నీ చెబుతోంది. ముఖ్యంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోమని అలెర్ట్ గా ఉండమని మిగిలిన వారికి కనీసం మీటర్ దూరంలో నిలబడాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో శానిటైజర్ ల వాడకం పట్ల అవగాహన పెరుగుతోంది. దీంతో మార్కెట్ లో శానిటైజర్ లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. డబల్ రేట్లు పెట్టి మరీ వాటిని కొనుగోలు చేస్తున్నారు. కొనుక్కోగలిగిన వాళ్ళ సంగతి ఓకే. మరి శానిటైజర్, ముఖానికి వేసుకునే మాస్క్ లు కొనుగోలు చేయలేని వారి సంగతి ఏంటి?
అందుకే మనోజ్ వీటిని ఆఫోర్డ్ చేయలేని వారికి శానిటైజర్ లు, మాస్క్ లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో ఆదుకుంటున్న మనోజ్ నిజమైన హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే మనోజ్ మూడేళ్ళ తర్వాత రీసెంట్ గా తన తర్వాతి సినిమా గురించి ప్రకటన చేసిన సంగతి తెల్సిందే. ఈ మధ్యే ఆ చిత్రం లాంచ్ అయింది కూడా. పేరు అహం బ్రహ్మాస్మి, శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తారు. మనోజ్ ఈ సినిమాతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు.