మీటూ వివాదం ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నటుడు నానా పటేకర్, ఏక్నాథ్, వికాస్ బెహెల్ నుంచి మొదలైన ఈ వివాదం దక్షిణాదిలోనూ ఇంకా కొనసాగుతోంది. శ్రీరెడ్డి కారణంగా టాలీవుడ్లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఆ తరువాత బాలీవుడ్లో తనూశ్రీ దత్తా కారణంగా మరోసారి వివాదాస్పదంగా మారింది. ఒక దశలో బాలీవుడ్లో తనుశ్రీదత్తా రాజేసి మీటూ మంటలు బాలీవుడ్ని అతలాకుతలం చేశాయి. మీటూ ఆరోపణల్లో చిక్కుకున్న వారంతా తాము చేస్తున్నసినిమాల నుంచి అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.
గత కొన్ని నెలలుగా తమిళ చిత్ర పరిశ్రమలో మీటూ వివాదం సంచలనం రేపుతోంది. గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కారణంగా కొంత కాలం చిన్మయిని డబ్బింగ్ చెప్పకూడదంటూ ఆంక్షలు విధించారు కూడా. దీంతో రోడ్డెక్కిన చిన్మయి రచ్చ చేసి వైరముత్తు కారణంగానే తనని డబ్బింగ్ కళాకారుల సంఘం వెలేసిందని సోషల్ మీడియా వేదికగా చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల మణిరత్నం రూపొందిస్తున్న `పొన్నియన్ సెల్వన్` చిత్రానికి వైరముత్తు పాటలు రాస్తున్నారు.
మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని వెలివేయకుండా తమ చిత్రానికి ఎలా పెట్టుకుంటారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మణిరత్నంను నిలదీశారు. అయితే అది తన సొంత వ్యవహారమని బదులిచ్చిన మణిరత్నం రచయిత వైరయుత్తుకు సపోర్ట్గా నిలిచారు. దీంతో ఈ సినిమా అంగీకరించిన నటీనటులు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లడం మణిరత్నంకు తలనొప్పిగా మారింది. రజనీ సినిమా కారణం చెప్పి కీర్తిసురేష్ తప్పుకోగా, రియాజ్ఖాన్, హీరోయిన్ అనుష్క కూడా ఈ సినిమా నుంచి బయటికి వచ్చేయడం కలకలం రేపుతోంది. దీంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పరిస్థితేంటి ఇలా వుందని అగ్ర దర్శకుడు మణిరత్నం విలవిల లాడుతున్నాడట.