`అనగనగ ఒక ధీరుడు` సినిమాలో ఐరేంద్రిగా ప్రతినాయక పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది మంచు లక్ష్మి. మళ్లీ ఆ తరహా పాత్ర లభిస్తే చేయాలని ప్రయత్నించింది కానీ ఆ అవకాశం దక్కలేదు. తాజాగా అంతకు మించిన పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా వున్నానని చెబుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `ఆది పురుష్`. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని త్రీడీలో అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు.
టిసీరస్ బ్యానర్పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. రామాయణ గాధ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మితం కానున్న విషయం తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నారని ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్తో స్పష్టమైంది. మోషన్ పోస్టర్లో వున్న క్యారెక్టర్లని బట్టి ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తారని క్లారిటీ వచ్చింది.
ఇదిలా వుంటే ఈ చిత్రంలోని శూర్పణక పాత్రలో మంచు లక్ష్మి నటించాలని ఆశపడుతోందట. ఆ పాత్ర తనదేనని, అందులో నటించడానికి తాను రెడీ అని చెబుతోంది. మరి మంచు లక్ష్మి ని ఆపాత్ర కోసం ప్రభాస్ రికమెండ్ చేస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.