చిత్రసీమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది కరోనా తో మృతి చెందుతుంటే..మరికొంతమంది పలు అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రముఖ సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి మరణించగా..ఆయన మరణ వార్త నుండి ఇంకా బయటపడక ముందే మరో మరణ వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు, కొట్టాయం ప్రదీప్గా పేరొందిన ప్రదీప్ కేఆర్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు.
మంచి పాత్రలతో అలరించిన ఈ సీనియర్ నటుడ్ని మలయాళీ సినీ జనాలు కొట్టాయం ప్రదీప్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన వయసు 61 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలయాళం, తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో ప్రదీప్ నటించారు. అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఏ మాయ చేశావే’ మూవీలో ప్రదీప్ యాక్ట్ చేశారు. జార్జ్ అంకుల్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంపై దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విచారం వ్యక్తం చేశారు.
‘మీ ఆత్మకు శాంతి చేకూరాలి కొట్టాయం ప్రదీప్’ అంటూ ఆయన ఫోటోని షేర్ చేశాడు. అలాగే ‘మిన్నాళ్ మురళీ’ ఫేమ్ టోవినో థామస్ ఇన్స్టాగ్రామలో ఆయన పిక్ పోస్ట్ చేసి.. దానికి ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. మరో నటుడు సైతం సోషల్ మీడియాలో ‘మీ కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు.