కరోనా మహమ్మారి భారత్లో అంతకంతకూ విస్తరిస్తోంది. రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. సమాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కొంత మంది కోలుకుంటున్నా కొంత మంది మాత్రం బలైపోతున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ నుంచి రాజమౌళి కుటుంబం వరకు కరోనా బారిన పడి క్షేమంగా బయటపడ్డారు.
కరోనా గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో భీభత్సం సృష్టిస్తోంది. బాలీవుడ్లో అయితే దీని తీవ్రత మరీ ఎక్కువగానే వుంది. తాజాగా సెక్సీ నటి మలైకా అరోరా కూడా కరోనా బారిన పడ్డారు. మోడల్గా, ప్రత్యేక గీతాల నటిగా పేరు తెచ్చుకున్న ఆమె ఇటీవల భర్త అర్భాజ్ఖాన్తో విడిపోయి వేరుగా వుంటోంది. పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఆమె తాజాగా కరోనా బారిన పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా మలైకా అరోరా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇటీవల చేయించుకున్న టెస్టుల్లో తనకు పాజిటివ్ అని తేలిందని, అయితే తన ఆరోగ్యం బాగానే వుందని, డాక్టర్ల సలహాపై హోమ్ ఐసోలేషన్లోకి వెళుతున్నానని ప్రకటించింది. ఆ వెంటనే ఆమె బాయ్ఫ్రెండ్ అర్జున్ కపూర్ తనకూ కరోనా సోకిందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.