`అల వైకుంఠపురములో` చిత్రంతో ఈ ఏడాది తన చిర కాల కోరిక అయిన ఇండస్ట్రీ హిట్ని దక్కించుకున్నారు బన్నీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ మ్యూజికల్ మ్యాజిక్ గా వండర్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఉత్సాహంతో బన్నీ `పుష్ప` చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్ మొత్తం తారుమారైంది. ప్రస్తుతం వైరస్ పూర్తిగా తగ్గి వ్యాక్సిన్ వస్తే గానీ సెట్స్లోకి వెళ్లకూడదని హీరో నిర్ణయించుకున్నారట. ఇదిలా వుంటే బన్నీ మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలిసింది. ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి విభిన్నమైన చిత్రాల దర్శకుడు మహి వి. రాఘవ్కి బన్నీ ఆఫర్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాలని షాక్కు గురిచేస్తోంది.
ఇటీవల మహి. వి. రాఘవ్ చెప్పిన లైన్ బన్నీకి విపరీతంగా నచ్చేసిందట. వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి మరోసారి నరేట్ చేయమని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీది కమర్షియల్ ట్రాక్, మహి. వి. రాఘవ్ ఇప్పటి వరకు ఆ రేంజ్ సినిమా చేయలేదు. మరి ఇద్దరికి ఎక్కడ సింక్ అయ్యిందన్నదే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.