భారీ చిత్రాలల్లో నటించి క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోలు తరువాత చిన్న బ్రేక్ ఇస్తుంటారు. స్టార్ హీరో మహేష్ కూడా బ్రేక్ తీసుకోబోతున్నారట. మహేష్ నటించిన భారీ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` ఈ సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్గా టాక్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
మహేష్ `బ్రహ్మాత్సవం` నుంచి వరుస షూటింగ్లతొ బిజీగా గడిపేస్తున్నారు. బ్రహ్మాత్సవం, స్పైడర్ డిజాస్టర్లుగా నిలవడంతో కంగారుపడ్డ మహేష్ భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు… వరకు రెస్ట్ లేకుండా వర్క్ చేశారు. ప్రస్తుతం `సరిలేరు నీకెవ్వరు` భారీ విజయాన్ని సాధించి రికార్డు స్థాయి వసూళ్లని సాధిస్తున్న నేపథ్యంలో చాలా హ్యాపీగా వున్న మహేష్ బ్రేక్ తీసుకోబోతున్నారట.
మూడు నెలలు బ్రేక్ తీసుకున్న తరువాతే తదుపరి చిత్రానికి సిద్ధం కావాలని అనుకుంటున్నారట. ఈ రోజే చిత్ర యూనిట్తో కలిసి తిరుపతి వెళ్లిన మహేష్ శ్రీవారిని దర్శించుకుని తిరిగి వచ్చాక వెకేషన్ కోసం అమెరికా వెళ్లనున్నట్టు తెలిసింది. మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయబోతున్న విషయం తెలిసిందే.