గత ఎనిమిది నెలలుగా లాక్డౌన్ కారణంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితం అయిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్లాక్ ఎనిమిది భాగంగా ఇప్పటిడిప్పుడే పరిస్థితులు మారుతుండటంతో మళ్లీ షూటింగ్లు మొదలయ్యాయి. జన జీవితం చిన్న చిన్నగా గాడిలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారంతా రిలాక్స్ కోసం విహార యాత్రలకు వెళుతున్నారు. ప్రత్యేకంగా వెకేషన్ని ప్లాన్ చేసుకుంటున్నారు.
స్టార్ హీరో మహేష్బాబు కూడా వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్లు ఆగిపోవడంతో ఇంటి పట్టునే వుంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తున్న మహేష్ శనివారం ఫ్యామిలీతో కలసి విదేశాలకు వెకేషన్కి వెళ్లారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ఫ్లైటెక్కారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఏయిర్పోర్ట్లో సందడి చేశారు.
`సాధారణ పరిస్థితులకు అలవాటు పడాలి. సురక్షితమైన విమానానికి అంతా సిద్ధం. జీవితం మళ్లీ ట్రాక్ ఎక్కింది. గెట్ సెట్ గో` అని ట్వీట్ చేశారు మహేష్. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కాబోతోంది. 40 రోజుల పాటు కీలక షెడ్యూల్ని ప్లాన్ చేశారు. ఇందు కోసమే ముందుగా మహేష్ ఫ్యామిలీతో సహా వెళ్లి నట్టు తెలుస్తోంది.