ప్రభుత్వం కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఎవరి ఇళ్లల్లో వారు ఉంటేనే ఈ మహమ్మారిని అరికట్టడానికి అవకాశం దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీ, కామన్ మ్యాన్ అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే స్టార్లు మరి ఈ లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
ముఖ్యంగా టాప్ హీరోల విషయంలో ఈ ఆసక్తి ఉండటం సాధారణం. సినిమా షూటింగ్ లు లేదంటే ఇల్లు తప్ప మరో లోకం లేని మహేష్ ఏం చేస్తున్నట్లు? ఈ విషయంపై నమ్రత క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సమ్మర్ లో మూడు నెలలు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాం. ఈ లాక్ డౌన్ వల్ల మా ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉండడమే ఉత్తమం. మా పిల్లలకు కూడా ఇదే చెబుతున్నాం.
ఇక మహేష్ ఈ ఖాళీ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. పిల్లలతో ఆడుకోవడానికి మరింత అవకాశం దొరికింది. సితార, గౌతమ్ లతో మహేష్ కు సమయమే తెలియట్లేదు. ఇక మామూలుగానే మహేష్ సినిమాలు ఎక్కువ చూస్తారు, ఇక ఖాళీ సమయం దొరకడంతో భాషతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసేస్తున్నారు. ఇక పుస్తకాలూ చదవడమన్నా కూడా మహేష్ కు ఎంతో ఇష్టం. ఈ మూడు పనులతో మహేష్ లాక్ డౌన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబు తర్వాతి సినిమాపై సంగిగ్దత కొనసాగుతోంది. ముందు వంశీ పైడిపల్లితో అనుకున్నారు కానీ తర్వాత పరశురామ్ అన్న పేరు కూడా వచ్చింది. ఇప్పుడేమో పరశురామ్ పేరు దాదాపు కన్ఫర్మ్ అయింది. జూన్ లో ఈ చిత్రం లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ పూర్తయితే కానీ ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.