కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రసిద్ధి. అయితే సినిమాల పరంగా చూసుకుంటే ఈ సెంటర్ పేరు చెప్పగానే సూపర్ స్టార్ మహేష్ బాబే గుర్తొస్తాడు. అంతలా ఆ సెంటర్ ను ఓన్ చేసేసుకున్నాడు. ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ లో ప్రకాష్ రాజ్ ను కొట్టే సన్నివేశం ఒక ఐకానిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి కూడా కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. ఈ సెటప్ లో చాలానే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఈ సీన్స్ చూసినప్పుడల్లా ఒక్కడు సీన్స్ గుర్తుకురావడం సహజమే.
ఇదంతా ఓకే కానీ ఈ సెంటర్ కు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి అంటే ఉంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా విచ్చేసిన సంగతి తెల్సిందే. ఈ ఈవెంట్ లో చిరంజీవి చాలా సందడిగా కనిపించారు. ముఖ్యంగా విజయశాంతికి తనకు మధ్య ఉన్న అపార్ధాలను, దూరాన్ని తగ్గించుకున్న విధానం అందరికీ ముచ్చట గొల్పింది. అసలు చిరంజీవిని ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా పిలవాలన్న ఐడియా ఎవరిది? అంటే ఇంకెవరిది మహేష్ బాబుదేనట.
అయితే ఇదేదో ఈవెంట్ కు కొన్ని రోజులు ముందు వచ్చిన ఆలోచన కాదట. సినిమా షూటింగ్ లో ఉండగానే నాలుగు నెలల ముందుగానే మహేష్ కు ఈ ఆలోచన వచ్చిందట. ఆలోచన రాగానే దర్శకుడు అనిల్ రావిపూడికి చెప్పడం ఆయన కూడా ఎగ్జైట్ అవ్వడం జరిగాయట. వెంటనే చిరంజీవికి మెసేజ్ పెడితే తాను తప్పకుండా వస్తానని అన్నారని తెలుస్తోంది. చిరంజీవిని ఆహ్వానించాలన్న నిర్ణయం కొండరెడ్డి బురుజు సెంటర్ షెడ్యూల్ చేస్తున్నప్పుడే మహేష్ కు తిట్టిందట. ఆ రకంగా చిరుకి, ఈ సెంటర్ కు కనెక్షన్ ఏర్పడిందన్నమాట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు మహేష్. చిరంజీవి గారు రావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆయన అన్ని రకాలుగా తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు మహేష్.