నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తాజాగా పోలీసుల్ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న మాధవీలత తాజాగా మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజాగా తనని కొంత మంది టార్గెట్ చేశారని, సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారని చెబుతోంది.
ఇదే విషయంపై పోలీస్ అధికారి సజ్జనార్ని కలిసి తనని వేధింపులకు గురిచేస్తున్న వారిపై కఠన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవిబాబు దర్శకత్వంలో తనీష్ హీరోగా నటించిన `నచ్చావులే` చిత్రంతో మాధవీలత హీరోయిన్గా పరిచయమైంది. ఆ తరువాత రైడ్, స్నేహితుడా వంటి చిత్రాల్లో నటించింది.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న మాధవీలత బీజేపీలో చేరి సోషల్ మీడియా వేదికగా పలు సమస్యలపై తన గళం వినిపిస్తోంది. అయితే తాజాగా తననే కొంత మంది టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని, ఏదైనా కేసులో అమ్మాయిలు దొరికినా అందులో తన పేరుని కలిపి ప్రచారం చేస్తున్నారని వాపోతోంది.