సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తేడా తెలియడం లేదు. రోజుకో వైరల్ న్యూస్ని పుట్టించడం, బ్రతికి వున్న వారిని చంపేయడం నిత్య కృత్యంగా మారింది. న్యూస్ కంటే ఫేక్ న్యూస్ భారీ స్థాయిలో వైరల్ కావడం మొదలైంది. ఇటీవల ప్రముఖ గాయని జానకి మృతి చెందారంటూ కొంత మంది ప్రచారం చేస్తే స్వయంగా ఆమె తనకు ఏమీ కాలేదని, బాగానే వున్నానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తాజాగా అలాంటి పుకారే ప్రముఖ గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ పై వైరల్ కావడం తెలిసింది. దీనిపై స్వయంగా సుద్ధాల అశోక్ తేజ వివరణ ఇస్తూ ఓ వీడియోని మీడియాకు విడుదల చేశారు. మే 24న గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సర్జరీ పూర్తయ్యాక ఆయన ఆరోగ్యంగానే వున్నారని సుద్ధాల మేనల్లుడు ఉత్తేజ్ వెల్లడించారు. ఆ తరువాత ఆయనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో సుద్ధాలపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి.
ఈ పుకార్లపై సుద్ధాల స్పందించారు. తను క్షేమంగానే వున్నానని, పాటలు కూడా రాస్తున్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని, తాను మామూలు స్థితిలోనే వున్నానని స్పష్టం చేశారు. స్వయంగా సుద్ధాల తన ఆరోగ్యంపై వీడియో సందేశం పంపించడంతో ఆయనపై వస్తున్న పుకార్లకు ఎండ్ పడింది.