వెండితెరపై బయోపిక్ల సందడి ఎక్కువైంది. ప్రేక్షకుల్లో ఈ తరహా చిత్రాలపై ఆసక్తి పెరగడంతో మేకర్స్ కూడా జీవిత కథల్ని తెరపైకి తీసుకురావడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రేజీ బయోపిక్స్ నిర్మాణంలో వున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో జయలలిత బయోపిక్లు రూపొందుతున్న విషయం తెలిసిందే ఇదే తరహాలో బాలీవుడ్ లోనూ వీరుల విజయగాధలకు సంబంధించిన కథలతో వరుస బయోపిక్లు రూపొందుతున్నాయి. అయితే వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఓ సామాన్యురాలి కథ తెరపైకి వస్తోంది.
ఆమె యాసిడ్బాధితురాలు లక్ష్మీ అగర్వాల్. దీపికా పదుకోన్ నటిస్తూ ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్,గోవింద్ సింగ్ సందూ, మేఘనా గుల్జార్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ హక్కులకు గానూ లక్ష్మీ అగర్వాల్కు చిత్ర బృందం కేవలం 13 లక్షలు అందించారట. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఎస్ ధోనీ తన బయోపిక్ కోసం నిర్మాణ సంస్థ నుంచి 100 కోట్లు తీసుకున్నాడట. ధోనీ అంత కాకున్నా భారీ మొత్తం లక్ష్మీ అగర్వాల్కి రైట్స్ రూపంలో ఇవ్వాల్పిందనే వాదన బాలీవుడ్లో వినిపిస్తోంది.
లక్ష్మీ అగర్వాల్ కూడా తనకు చిత్ర బృందం 13 లక్షలతో సరిపెట్టడం నచ్చడం లేదని, తనకు మరి కొంత మొత్తం కావాలని డిమాండ్ చేస్తోందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదన నడుస్తోందని, దీనిపై ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్న దీపిక కలగజేసుకుంటే మంచిదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి దీపికా పదుకోన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.