కింగ్ నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై డి. సురేష్బాబుతో కలిసి నిర్మించిన చిత్రం `ఉయ్యాల జంపాల`. ఈ మూవీతో రాజ్ తరుణ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. విరించి వర్మ దర్శకత్వంలో అత్యంత లో బడ్జెట్లో నిర్మించిన ఈ చిత్రం ప్రొడ్యూసర్స్కి మంచి లాభాల్ని అందించింది. అ మూవీ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు కింగ్ నాగార్జున అన్నపూర్ణ బ్యానర్పై రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ గత కొంత కాలంగా బ్యాడ్ ఫేజ్ని ఫేస్ చేస్తున్నారు. ఇక అతని కెరీర్ ఇంతేనా అనే సమయంలో విజయ్ కుమార్ కొండా `ఒరేయ్ బుజ్జిగా` అంటూ ఓ రొమాంటిక్ లవ్స్టోరీని తెరపైకి తీసుకొచ్చారు. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా `ఆహా` ఓటీటీ బాట పట్టాల్సి వచ్చింది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాన్ని అంగీకరించినట్టు తెలిసింది.
రాజ్ తరుణ్తో `సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు` ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. ఏ ధైర్యంతో మళ్లీ ఇదే కాంబినేషన్ని నాగ్ రిపీట్ చేస్తున్నారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల 14న భీమవరంలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.