`మహానటి` తరువాత కీర్తి సురేష్ అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయారు. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ గత కొంత కాలంగా కథానాయిక ప్రధాన్యత వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి చిత్రాల తరువాత తాజాగా రెండు క్రేజీ చిత్రాలకు ఓకే చెప్పేసింది. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న `రంగ్ దే`, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న `అన్నాతే` చిత్రాల్లో నటిస్తోంది.
ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా వుంటే కీర్తి తాజాగా మరో రెండు చిత్రాల్ని అంగీకరించినట్టు తెలిసింది. సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ నటిస్తున్న మరో చిత్రాన్ని కూడా కీర్తి ఒకే చెప్పినట్టు తెలిసింది.
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య ‘పవర్ పేట’ పేరుతో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా కీర్తి సురేష్ నటించనున్నట్టు తెలిసింది.
- Advertisement -