తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పెట్టబోతున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి రోజు రెండు వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ముందు నుండి అంత చెప్పుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చ జరగనుంది.
రాత్రిపూట కర్ఫ్యూ విధించే అంశాన్నీ ఈ కేబినెట్ భేటీలో పరిశీలించే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశాఖ సూచన మేరకు జనవరి 30 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మరి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. వీకెండ్లో లాక్డౌన్ కూడా విధిస్తున్నాయి.
మరి ఈ తరుణంలో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ మొదలుపెడతారా లేదా అనేది చూడాలి. అలాగే ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి రావడంతో ఉద్యోగ ఖాళీల వివరాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ పరంగా యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో ఎరువుల ధరలు బాగా పెరిగాయి. ఈ ధరలను తగ్గించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ చేపట్టే అవకాశాలున్నాయని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం.