ముంబై మహా నగరాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోలుస్తూ ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలు ముంబైలో రాజకీయ దుమారాన్ని రేపాయి. దీంతో శివసేన ఎంపీ సంజయ్రౌత్తో పాటు ఓ ఎమ్మెల్యే కంగన ముంబైలో అడుగుపెడితే రాళ్లతో కొట్టి చంపుతామని తీవ్ర స్థాయిలో హెచ్చిరికలు చేశారు. దీనికి ప్రతిగా `ఈ నెల 9న ముంబైలో అడుగుపెడతానని, తనని ఎవరు ఆపుతారో ఆపండని కంగన సవాల్ విసిరారు.
దీంతో ముంబైలో హై అలర్ట్ అయింది. కరోనా వైరస్ కారణంగా ముంబైని వీడి హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని భన్వాలా నుంచి కొద్ది సేపటి క్రితమే కంగన ముంబై బయలుదేరింది. శివసేన హెచ్చరికల నేపథ్యంలో కంగనకు కర్ణిసేన అండగా నిలుస్తోంది. కంగనతో విమానంలో కొంత సిబ్బందిని ఏర్పాటు చేసిన కర్ణిసేన కంగనని ఇంటి వరకు చేరవేయడంతో ప్రధాన పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది. దీనికి తోడు కేంద్ర హోమ్ శాఖ కంగనకు 11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో కంగన ముంబై రాక హై టెన్షన్ని క్రియేట్ చేస్తోంది. కంగనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ముంబై పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడం మరింత కలకలం రేపుతోంది.