గత రెండు రోజులుగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. కరోనా విషయంలో ఆమె అజాగ్రత్త, బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల ఎంత నష్టం జరగనుందోనని అందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అసలు విషయంలోకి వెళితే విదేశాల నుండి వచ్చిన కనికా విమానాశ్రయంలో స్క్రీనింగ్ ను తప్పించుకుని ఇంటికి చేరుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దీన్ని కనికా కపూర్ ఖండించింది. అలా ఎవరైనా చేయగలరా, తనకు మాత్రం బాధ్యత లేదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే చివరికి ఆమెకు స్క్రీనింగ్ జరగలేదనే తేలింది.
ఇక ఇంటికి వచ్చాక తాను ఎవరినీ పెద్ద కలవలేదని, తనను తాను నిర్బంధించుకునే ఉన్నానని, కేవలం ఒక్క పార్టీకి మాత్రమే హాజరయ్యానని, దానికి కూడా గ్లోవ్స్ వేసుకుని వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే అది కూడా అబద్దమనే తేలింది. ఆమె ఒకటికి మూడు పార్టీలకు వెళ్లినట్లు స్వయంగా తన నాన్నే చెప్పుకొచ్చారు. 13న ఒక పార్టీకి వెళ్లిన కనికా 15న మరో రెండు పార్టీలకు వెళ్లినట్లు తేలింది. అలాగే ఆమె దాదాపు 400 మందిని కలిసినట్లు సమాచారం. అది కూడా కొంత మందితో క్లోజ్ గా ఫోటోలు కూడా దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు బయటపడగా ఆమె చేతికి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ వంటివేమీ లేవు.
అంటే ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ అందరితో చాలా మాములుగా తిరిగేసిందన్నమాట. ఇందులో ఎంపీలు, మినిస్టర్లు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, అది బాలేదు ఇది బాలేదు అంటూ హాస్పిటల్ లో కూడా గొడవపడగా, ఆ హాస్పిటల్ హెడ్ ఆమె స్టేటస్ గురించి వివరించాడు. తనకు ట్రీట్మెంట్ జరుగుతోందని అయితే ఆమె సెలబ్రిటీలా కాకుండా ఒక పేషెంట్ గా తమతో సహకరించాలని తెలిపారు. ఆమెకు అన్నీ మంచి సదుపాయాలు కల్పించామని వివరించారు.
ఇలాంటి కష్ట సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కనికా కపూర్ ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కోపం తెప్పిస్తోంది.