బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్.. వివాదం.. సంచలనం.. ఏదైనా సరే దానిపై సూటిగా స్పందించడంలో కంగనని మించిన వారు లేరు. విషయం ఏదైనా సూటిగా స్పందించడం .. వివాదం అవుతుందని తెలిసినా దానిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కంగనకు కొత్తేమీ కాదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై బాలీవుడ్ బిగ్గీస్ని టార్గెట్ చేసి సంచలనం సృష్టించింది.
ఈ వివాదం కారణంగా స్వయంగా మహారాష్ట్ర సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోసారి బాలీవుడ్పై కంగన విరుచుకుపడింది. మలయాళీ చిత్రం `జల్లికట్టు` 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ తరుపున ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా `జల్లికట్టు` చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ బాలీవుడ్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
`ప్రతి ఒక్కరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీవుడ్ గ్యాంగ్కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ అనేది కేవలం నాలుగు కుటుంబాలకు మాత్రమే చెందింది కాదు. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లల్లోనే దాక్కోండి. ఎందుకంటే జ్యూరీ తన విధిని నిర్వర్తిస్తుంది. `జల్లికట్టు` చిత్ర బృందానికి కంగ్రాట్స్` అని కంగన ఘాటుగా స్పందించింది.