కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జనతా కర్ఫ్యూ పాటించడానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ అందరూ ఇళ్లకే పరిమితం కావాలని అన్నారు. అయితే ఇందులో జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం తెలుగు ఇండస్ట్రీకి చెందిన 28 మంది నటీనటులు అరగంటకు ఒకరి చొప్పున ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కు వచ్చి ప్రేక్షకులను పలకరించనున్నారు. అందులో భాగంగా ఉదయం 7 గంటలకు మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లైవ్ తో సందడి మొదలైంది. ఏడున్నరకు నవదీప్ లైవ్ కు వచ్చాడు. తర్వాత 8 గంటలకు చందమామ కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. తను అల్పాహారం తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కు రావడం విశేషం.
ఇందులో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ కాజల్ అగర్వాల్ తన నెక్స్ట్ సినిమా గురించి రివీల్ చేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ సినిమా ఆచార్యలో ముందు హీరోయిన్ గా త్రిషను అనుకున్నారు. అయితే తర్వాత ఆమె క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా చిత్రం నుండి వాకౌట్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ కాజల్ అగర్వాల్ ను సంప్రదించినట్లు ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకుని అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇలాంటి వార్తలు ఎంత బలంగా వచ్చినా కూడా అధికారికంగా చెబితే కానీ నమ్మరు. అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కాజల్ మాట్లాడుతూ అవును ఆచార్యలో నేను కూడా నటించబోతున్నాను అని రివీల్ చేసేసింది. కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ లు ఆగిపోయాయి. మళ్ళీ షూటింగ్ లు మొదలైతే కాజల్ అగర్వాల్ ఆచార్య షూట్ లో జాయిన్ అవుతుంది. అయితే అది జరగడానికి మరో నెల రోజులు పట్టే అవకాశముంది.