కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, దీని నివారణ బాధ్యతను ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నారు. తన వంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్ని వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హాల్స్, మాల్స్ను మూసివేయడం, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని వెల్లడించారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్గారు ప్రజల్లో ధైర్మాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డిగారు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను అన్నారు.
సినిమా షూటింగ్లలో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్స్ పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగ్లు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా వాయిదా వేద్దామని కొరటాల శివతో అన్నప్పుడు ఆయన వెంటనే సరే అన్నారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు. కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది వున్నప్పటికీ కరోనా వైరస్ను నియంత్రించే ఉద్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని, దీనికి అంతా సహకరిస్తారని ఆశిస్తున్నాను` అన్నారు చిరంజీవి.