![తెలుగు బ్లాక్ బస్టర్ మిస్సయిన కంగన! తెలుగు బ్లాక్ బస్టర్ మిస్సయిన కంగన!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/04/Kagana-ranaut-intaresting-comments-on-Pokiri.jpg)
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ని మిస్సయిందంట. మహేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం `పోకిరి` . పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై ఈ నెల 28తో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ హాట్ హాటమ్ బాంబ్ కంగన రనౌత్ ఈ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రం గేమ్ ఛేంజర్గా మారింది. తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. అయితే ఈ చిత్రంలో నటించే అవకాశం తనకు వచ్చిందని అయితే దాన్ని తాను వినియోగించుకోలేకపోయానని వెల్లడించింది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ “గ్యాంగ్స్టర్` సినిమా ఆడిషన్స్కు వెళ్లిన సమయంలోనే `పోకిరి` ఆడిషన్స్ జరిగాయి. ఈ రెండు చిత్రాలకు ఎంపికయ్యాను. అయితే ముందుగా `గ్యాంగ్స్టర్`కు డేట్స్ ఇచ్చేయడంతో `పోకిరి` చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత పూరి చేసిన `ఏక్ నిరంజన్`లో నటించా` అని తెలిపింది.
కంగన నటిస్తున్న తాజా చిత్రం `తలైవి`. జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం వేసిన సెట్లని త్వరలో కూల్చబోతున్నారు.