అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసింది. ఆమె కేవలం హీరోల పక్కన నటించే గ్లామర్ తారగానే కాకుండా తొలి లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది. వెండితెర పరవశించే అందం శ్రీదేవి సొంతం. అలాంటి నటి వారసురాలుగా ఎంట్రీ ఇచ్చింది ఆమె గారాల పట్టి జాన్వీకపూర్. మరాఠీ భాషలో పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం `సైరట్`. ఇదే చిత్రాన్ని `ధడక్` పేరుతో కరణ్ జోహార్ రీమేక్ చేసిన చిత్రంలో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది జాన్వీకపూర్.
ఆ తరువాత నుంచి తెలుగులో ఆమె సినిమా ఎప్పుడు చేస్తుందా అని టాలీవుడ్ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో జాన్వీ బిజీగా వుండటంతో అది ఎప్పటికప్పుడు వాయదా పడుతూ వస్తోంది. `జగదేకవీరుడు అతిలోక సుందరి` సీక్వెల్ చేస్తే ఆ సినిమాతో జాన్వీని పరిచయం చేయాలని అశ్వనీదత్ భావించారు కానీ కుదరలేదు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని వుందని ఓ షోలో స్వయంగా జాన్వీ చెప్పడంతో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుందని ఊహాగానాలు వినిపించాయి.
పూరి కూడా గట్టిగానే ట్రై చేశాడు కానీ చివరికి అనన్య పాండేతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ల కలయికలో తెరపైకి రాబోతున్న చిత్రంలో జాన్వీ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తూ జాన్వీ బిజీగా వుంది. ఈ టైమ్లో తెలుగు సినిమాకు డేట్స్ ఇవ్వడం కుదిరేపని కాదు. అక్కడ అంగీకరించిన సినిమాలన్నీ పూర్తయిన తరువాతే టాలీవుడ్ ఎంట్రీ వుంటుందని బోనీ కపూర్ సన్నిహిత వర్గాల సమాచారం.