గుండెపోటుతో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడం తో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి కి తరలించారు. హాస్పటల్ కు వెళ్లే లోపు ఆయన మృతి చెందారు. ఈయన మరణ వార్త విని రాజకీయ నేతలే కాదు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. గౌతమ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గౌతమ్ ఇంటి వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. రాజకీయ నేతలతో పాటు వైసీపీ కార్య కర్తలు , అభిమానులు , సినీ ప్రముఖులు..పార్థివ దేహానికి నివాళ్లు అర్పిస్తున్నారు.
కొద్దీ సేపటి క్రితం తెలుగు దేశం అధినేత చంద్రబాబు , తెరాస పార్టీ మంత్రి కేటీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు నివాళ్లు అర్పించగా..ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళ్లు అర్పిస్తూ..గౌతమ్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. అసలు ఏంజరిగిదనేదానిపై తండ్రి రాజమోహన్రెడ్డి ని అడిగి తెలుసుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘గౌతమ్రెడ్డి సంతాపసభ’ నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, పార్టీ నేతలు హాజరయ్యారు. గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పరిశ్రమల శాఖ మంత్రి అయిన మేకపాటి వారం రోజులపాటు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ ప్రభుత్వం దుబాయ్ ఎక్స్పో వేదికగా పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూలు చేసుకుంది. వారం రోజులపాటు పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం నాడు గౌతమ్ హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ కీలక భేటీలో దుబాయ్ పర్యటనకు సంబంధించి వివరాలన్నీ సీఎంకు వివరించాలని మేకపాటి అనుకున్నారు. భేటీ తర్వాత అమరావతిలోనే మేకపాటి ప్రెస్మీట్ కూడా నిర్వహించాలని భావించారు.. అయితే ఇంతలోనే పెనువిషాదం చోటుచేసుకుంది.