ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న దగ్గరనుండి ప్రశంసలు ఎన్ని వస్తున్నాయో, దానికి మించి విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవైపు నుండి ఆరోపణలు, అటునుండి వాదనలు, వివాదాలు ఇలా అన్నీ జగన్ సర్కారును ఇరుకునపెడుతున్నాయి. ఇటీవలే జగన్ సర్కారు 100 రోజుల పాలనను సమీక్షిస్తూ జనసేన విమర్శనాత్మక కోణంలో ఒక నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. దీనిపై వైఎస్సార్సీపీ హుందాగా ప్రవర్తించకుండా దాడులకు దిగడం సంచలనాత్మకమైంది.
రీసెంట్ గా పోలవరం వద్ద బోటు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఇలాగే బోటు ప్రమాదం జరిగినప్పుడు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని నిందించాడు జగన్. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసాడు. మరి ఇప్పుడు తన సర్కారు ఉన్న వేళ ఎవరి నిర్లక్ష్యమంటాడు? పరిహారం మాత్రం 10 లక్షలే ప్రకటించాడు.
ఇంతటితో విమర్శలు అయిపోలేదు. బోటు ప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు ఇద్దరు మంత్రులతో కలిసి హెలీకాఫ్టర్లో వెళ్లిన జగన్ అక్కడ మంత్రి అనిల్ తో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇద్దరూ నవ్వుకుంటుండగా తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక పెద్ద విషాద సంఘటన సమీక్షకు వెళుతూ ఇలా ఇద్దరు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు నవ్వుకోవడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ అండ్ కో ఎటువంటి సమాధానం చెబుతుందో చూడాలి.