తెలుగులో మోస్ట్ పాపులర్ రియాలిటీ షో గా పేరు పొందింది బిగ్బాస్. కాంట్రవర్సీలతో రియాలిటీ షోని పాపులర్ చేసిన నిర్వాహకులు తాజా సీజన్ కోసం కూడా అలాంటి ప్లాన్నే సిద్ధం చేస్తున్నారు. సీజన్ 3ని మించి సీజన్ 4ని రక్తికట్టించాలని భారీ సన్నాహాలు చేస్తున్నారు. గత మూడు సీజన్లని మించి తాజా సీజన్ని మరింత హీటెక్కించాలని, చర్చల్లో నిలబెట్టాలని కొత్త ఎత్తులు వేస్తున్నారట. తొలి సీజన్ని స్టార్ హీరో యంగ్టైగర్ ఎన్టీఆర్తో ప్రారంభించి శుభారంభాన్ని అందుకున్నారు.
ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన తొలి సీజన్ మంచి పాపులర్ అయింది. టీఆర్పీ రేటింగ్స్ లోనూ మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత రెండవ సీజన్ని నేచురల్ స్టార్ నానితో ప్రారంభించారు. లోకల్ కాన్సెప్ట్తో చాయ్ గ్లాస్తో నాని చేసిన ప్రోమో ఆకట్టుకుంది. అంతే స్థాయిలో శ్రీరెడ్డి కారణంగా వివాదాస్పదం కూడా అయ్యింది. ఆ తరువాత సీజన్ 3ని హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మధ్య గట్టి పోటీ ఏర్పడినా చివరికి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవడం తెలిసిందే. త్వరలో బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతోంది. దీని కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా రెడీ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా వేళ కంటెస్టెంట్లు ఈ ప్రోగ్రామ్కి ఓకే చెప్పడం అంత ఈజీ కాదు. అందుకే మేకర్స్ ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు ముందుగానే ఇన్సురెన్స్ చేస్తున్నారట. అది కూడా భారీ స్థాయిలో వుంటుందని తెలుస్తోంది.