పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. చార్మి, పూరిజగన్నాథ్తో కలిసి బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఓ కీలక షెడ్యూల్ని ముంబైలో పూర్తి చేసుకుంది. తిరిగి టీమ్ హైదరాబాద్లో వచ్చింది.
ఇక్కడే మరో కీలక షెడ్యూల్ ప్రారంభించాల్సి వుంది. అయితే అనూహ్యంగా కరోనా మమమ్మారి విజృంభించడంతో హైదరాబాద్ షెడ్యూల్ని వాయిదా వేశారు. లాక్డౌన్ తరువాత పరిస్థితులని బట్టి షూటింగ్ ప్లాన్ చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న సినిమాలో నటించనున్నారు.
ఇటీవలే ఈ చిత్రాన్ని అఫీషియల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే తాజాగా విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని దిల్ రాజుకు చేయబోతున్నారని తెలిసింది. ఇందుకు సంంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని దీనికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురానున్నారట. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ `వి` చిత్రాన్ని తెరకెక్కించారు. నాని, సుధీర్బాబు కలిసి నటించి యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాపడింది.