తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ మంగళవారం అభిమానులకు ఊహించని రీతిలో షాకిచ్చారు. ఈ నెల 31న పార్టీ ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్న వారికి రజనీ భారీ షాకివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో పార్టీ ప్రకటన చేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేస్తానంటూ ప్రకటించిన రజనీ మంగళవారం అనారోగ్య కారణాల దృష్ట్యా ఇప్పట్లో పార్టీని ప్రకటించడం లేదంటూ వెల్లడించి షాకిచ్చారు.
అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజా పేవ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖని విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటన కోసం ఎదురుచూసిన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డుమీదికి వస్తే తన ఆరోగ్యానికే ముప్పు గా మారే అవకాశం వుందని చెప్పారు.
తాను తీసుకున్న నిర్ణయం అభిమానులతో పాటు ప్రజలకు నిరాశను కలిగిస్తుందన్న విషయం తనకు తెలుసునని చెప్పిన రజనీకాంత్ ఈ విషయంలో తనని క్షమించాలని అభిమానుల్ని కోరారు. రజనీ తాజా నిర్ణయంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. తలైవా పార్టీ ప్రకటన మరో రెండు రోజుల్లో చేయనున్న నేపథ్యంలో తాజాగా చేసిన ప్రకటన పలువురిని నైరాశ్యంలోకి నెట్టేసింది.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020