వరుస అపజయాల తరువాత హీరో కార్తీ `ఖైదీ` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని తెలుగు, తమిళ భాషల్లో సొంతం చేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్తో రెట్టించిన ఉత్సాహంతో వున్న కార్తీ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఆయన నటించిన తాజా చిత్రం `సుల్తాన్`. బక్కియారాజ కన్నన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. `పాండవులకు అండగా నిలిచిన కృష్ణుడు కౌరవుల వైపు నిలబడితే.. అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీతో పాటు మణిరత్నం సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు కార్తీ.
‘ఖైదీ’ వంటి ఆఫ్ బీట్ చిత్రం తరువాత ‘సుల్తాన్’ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడానికి ప్రత్యేక కారణం వుందని, `సుల్తాన్` పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని కార్తి తెలిపారు. అంతే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిదని, ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ అని స్పష్టం చేశారు. ఇక మణిరత్నం `పొన్నియన్ సెల్వన్` గురించి వెల్లడిస్తూ ` ఇది ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే ఇతిహాసం, అని ఇక నుంచి ప్రతీ చిత్రాన్ని భిన్నంగా చేయాలనుకుంటున్నానని, కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అన్ని రకాల జోనర్లని టచ్ చేయాలనుకుంటున్నాను అని ఈ సందర్భంగా కార్తీ వెల్లడించారు.