సూపర్ స్టార్ మహేష్ బాబు పారితోషికం తీసుకోవడం ఎప్పుడో మానేసాడు. దానిబదులు సినిమాకు సంబంధించి హక్కులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో అటు మహేష్ కు, ఇటు నిర్మాతకు కూడా బడ్జెట్ విషయంలో సానుకూలత ఏర్పడుతోంది. మహేష్ గత సినిమా మహర్షికి నాన్ థియేట్రికల్ హక్కులు తీసుకున్నాడు. అంటే సాటిలైట్, ఆడియో, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కలిపి దాదాపు 45 కోట్ల వరకూ ముట్టింది.
ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా మహేష్ ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కులు మహేష్ చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ రకంగా దాదాపు 52 కోట్ల వరకూ మహేష్ కు ముట్టనుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కువయ్యాక నాన్ థియేట్రికల్ హక్కులకు డిమాండ్ పెరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.