`ప్రతి రోజు పండగే` చిత్రంతో 2019 ఇమర్ ఎండింగ్లో సాలీడ్ హిట్ని సొంతం చేసుకున్నారు యంగ్ డైరెక్టర్ మారుతి. ఈ మూవీ తరువాత మారుతి ఎవరితో సినిమా చేయబోతున్నాడు? ఏ నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించబోతోంది అంటూ రక రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. ఓ దశలో మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు షికారు చేశాయి.
ఆ తరువాత నందమూరి కల్యాణ్రామ్ హీరోగా మారుతి కొత్త తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని ఓ వినూత్నమైన వీడియోతో క్లారిటీ ఇచ్చారు మారుతి. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా మారుతి తన తాజా చిత్రాన్ని చేయబోతున్నారని, ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పై బన్నీవాసు, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా మేకర్స్ అనౌన్స్మెంట్ వీడియోని గురువారం విడుదల చేశారు. ఓ యునిక్ స్టోరీతో చక్కని భావోద్వేగాల సమాహారంగా ఈ మూవీని మారుతి ప్లాన్ చేస్తున్నారు. హీరో గోపీచంద్ నటించనున్న 29వ చిత్రం ఇది. అలాగే దర్శకుడు మారుతి డైరెక్ట్ చేయనున్న10వ సినిమా కావడం విశేషం. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లని చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది.