సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత స్వరం పెంచింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్. నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ మృతి చెందాడని బాలీవుడ్ బిగ్గీస్పై నిప్పులు చెరిగింది. ఈ విషయంలో ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముంబై పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసి అగ్గిరాజేసింది. దీంతో శివసేన సర్కారు కంగనపై వార్కు దిగిన విషయం తెలిసిందే.
ఈ వివాదం ఇంకా రగుతుండగానే కంగన మరో సారి రెచ్చిపోయింది. ఈ సారి ఏకంగా రైతుల్నే టార్గెట్ చూస్తూ వారిని ఉగ్రవాదులుగా పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కంగన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అయితే ఆమె వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన ఓ న్యాయవాది మండి పడ్డారు. కొవ్వుపట్టి దేశానికి అన్నంపెడుతున్న రైతన్నలని ఉగ్రవాదులంటూ కించపరుస్తోందని న్యాయవాది రమేష్ నాయక్ మండిపడ్డారు.
కంగన నీకు కొవ్వు పట్టింది. ఆ కొవ్వుని కరిగిస్తాం అని కంగనపై విరుచుకుపడ్డారు. అంతే కాకుండా కర్ణాటకలోని తుముకూరు జిల్లా ఎస్పీకి ఈమెయిల్ ద్వారా కంగనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. దీంతో కంగన లీగల్ చిక్కుల్లో పడింది. ఇటీవల కేంద్రం వ్యవసాయ బిల్లుల్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై హర్యానా, పంజాబ్ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రైతులు మండిపడుతున్నారు. ఏకంగా భారత్ బంద్కే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.