బాలీవుడ్లో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి తరువాత రియా కారణంగా డ్రగ్స్ వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సాండల్వుడ్ లోనూ డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంలో పలువురిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంజనతో పాటు మరో హీరోయిన్ రాగిణి దివ్వేదిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కష్టడీలో భాగంగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకి తరలించిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో ఆదాయానికి మించి సంజన ఆస్తుల్ని కూడబెట్టిందన్న ఆరోపణలు వినిపించాయి. దీనిపై సంజన ఏ కారణాలు చెప్పి తన ఆదాయానికి సంబంధించి ఎలాంటి నిజాలు చెప్పనట్టు తెలిసింది. దీంతో ఈ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ విచారణలో సంజన ఆన్ లైన్ బెట్టింగ్స్తో పాటు చైనీస్ యాప్ `హకున` ద్వారా చాలా మందిని ఏకం చేసి మోసాలకు పాల్పడిందని గుర్తించారట.
హీరోయిన్గా పాపులర్ కాని సంజన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ డ్రగ్ పార్టీ ద్వారా కోట్లల్లో డబ్బులు కూడబెట్టిందని ఈడీ గుర్తించి ఈడీ సంజన అక్రమ ఆస్తులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సంజన ఇక జైలుకే అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.