ప్రపంచ వ్యాప్తంగా కరోనా జడలు విప్పుతోంది. దీని కారణంగా యావత్ ప్రపంచం లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా జన జీవితం స్థంభించిపోయింది. ముఖ్యంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక మన దేశంలో లాక్డౌన్ సడలించిన దగ్గరి నుంచి కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సినిమా షూటింగ్లకు అనుమతులు లభించినా థియేటర్లకు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లేదు.
దీంతో సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియకపోవడంతో రిలీజ్కు రెడీగా వున్న చిత్రాల్ని నిర్మాతలు ఓటీటీలకు అమ్మేస్తున్నారు. ఇప్పటికే కొన్ని క్రేజీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మరికొన్ని రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్లపై దర్శకుడు శంకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. థియేటర్లో సినిమా చూసిన ఆనందాన్ని ఓటీటీ ఇవ్వలేదని, భవిష్యత్తు ఓటీటీలదే అయితే తాను సినిమా ఎలా తీయాలని ఆయన ఎదురు ప్రశ్నించారు.
ప్రస్తుత తరుణంలో తాను ఎలాంటి చిత్రాలు చేయాలో అర్థం కావడం లేదని, అయితే నిర్మాత నష్టపోనంత వరకు ఓటీటీ లో రిలీజ్ చేసినా మంచిదే అని ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ చెప్పుకొచ్చారు. శంకర్ ప్రస్తుతం కమల్హాసన్ హీరోగా `ఇండియన్ 2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభనకు ముందే క్రేన్ విరిగి పడటంతో ఈ చిత్ర షూటింగ్ని తాత్కాలికంగా ఆపేశారు. ఆ తరువాత ప్రారంభించినా కరోనా కారణంగా మళ్లీ ఆపాల్సి వచ్చింది.