భారీ చిత్రాల దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న శంకర్ అదే స్థాయిలో విమర్శల్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఇండియన్ 2`. 1996లో వచ్చిన `ఇండియన్` చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కమల్హాసన్ సేనాధిపతిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల చెన్నైలో జరుగుతుండగా లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ అదుపు తప్పి ఒక్కసారిగా విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది.
సెట్లో వున్న కృష్ణ, చంద్రన్, మధు అనే ముగ్గురు మృతి చెందారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఫైటర్స్ కూడా ఈ ప్రమాదంపై ఆగ్రహంతో వున్నారట. శంకర్ ఎన్ని కోట్లు పెట్టించి సినిమాలు తెరకెక్కిస్తున్నా యూనిట్ సేఫ్టీని పట్టించుకోవడం లేదని, బాధితులకు సరైన న్యాయం జరిగే వరకు ఈ ఉదంతాన్ని సీరియస్గా పరిగణించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గతంలో శంకర్ రూపొందించిన `అపరిచితుడు` కోసం సదాని చంపడానికి విక్రమ్ వెంటపడే ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగి లొకేషన్లో ఇద్దరు ఫైటర్స్ చనిపోయారు.
అప్పట్లో అది సంచలనం సృష్టించింది. మళ్లీ అదే తరహాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందడంతో కోలీవుడ్లో ఆగ్రహావేశాలని తెప్పిస్తోంది. ఈ విషయాన్ని సీరీయస్గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం సంఘటనపై ఎంక్వౌరీని ప్రారంభించింది. త్వరలోనే దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ని కూడా పోలీసులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.