సాయిధరమ్తేజ్ హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం `ప్రతిరోజు పండగే`. రాశిఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ -2తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మించింది. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించి హీరో సాయిధరమ్తేజ్కు తిరుగులేని విజయాన్ని అందించి కొత్త జోష్ని నింపింది.
ఈ సినిమా తరువాత మారుతి ఎనర్జిటిక్ స్టార్ రామ్తో సినిమా చేయబోతున్నాడని, ఇందుకు స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని, రామ్ నటిస్తున్న తాజా చిత్రం `రెడ్` పూర్తయిన తరువాత మారుతి చిత్రాన్ని ప్రారంబిస్తాడని ఇటీవల వరుస కథనాలు వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
ఇటీవల ఓ మీడియా వర్గంలో నా తదుపరి చిత్రంపై వచ్చిన కథనాలని విన్నాను. నా సినిమా కోసం ఆసక్తిని చూపిస్తున్నందుకు థ్యాంక్స్. అయితే నా తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అది పూర్తవడానికి కొంత సమయం పడుతుంది` అని తన తదుపరి చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మారుతి.