
మాటల ఘాటు పెంచారు బండి సంజయ్. సీఎం కామెంట్లపై సీరియస్గా రియాక్టయ్యారు బండి. నేషనల్ పాలిటిక్స్పై మాట్లాడే కేసీఆర్ తన హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా మరోసారి విమర్శలు గుప్పించారు బండి సంజయ్. తన కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్కు పట్టుకుందని విమర్శించారు.
సీఎం బాగా డిప్రెషన్లోకి వెళ్లారన్నారు బండి. అవినీతి కేసుల నుంచి దృష్టి మళ్లించేందుకు బహిరంగ సభలు పెడుతున్నారన్నారు. ఫ్రీ కరెంట్ అని ఊరికే చెప్తున్నారని.. గ్రామాల్లో 6 గంటల కరెంట్ కూడా ఉండటం లేదని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ నాశనమైపోయాయని.. ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు మోటర్లకు మీటర్లు గుర్తుకువస్తాయని ఎద్దేవా చేశారు. ఇక.. ఏ పండుగకూ లేని నిబంధనల్ని వినాయక నిమజ్జనానికి పెడుతున్నారని విమర్శించారు బండి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి, నలుగురు చనిపోవడంపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు బండి సంజయ్. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిపరుడు అంటూ ఘాటు ఆరోపణలు చేశారాయన. ప్రమోషన్లు, పోస్టింగ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు ఉందన్నారు. మంత్రికి నెలనెలా మూటలు అప్పచెబుతున్నారని.. త్వరలోనే డీహెచ్ను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేస్తారేమోనని కామెంట్ చేశారు. స్కూళ్లలో పరిస్థితి మరీ దారుణంగా తయారైందని.. చాక్పీస్, డస్టర్ కొనేందుకు డబ్బుల్లేని దయనీయ పరిస్థితి ఉందన్నారు బండి సంజయ్. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి గణేష్ నవరాత్రుల సందర్భంగా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను చేయడం లేదని బిజెపి తెలంగాణ సర్కారు తీరును తప్పు పడుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో సీఎం కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక వినాయక నిమజ్జనోత్సవానికి కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే, సీఎం కేసీఆర్ కు హిందువుల పండుగలు అంటే, అందులో ముఖ్యంగా వినాయక నవరాత్రులు అంటే శ్రద్ధ లేదని బీజేపీ విమర్శిస్తుంది.