రియా కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణకు ముందు తన పేరు ప్రసార మాధ్యమాల్లో రావడంతో కొంత నిరాశకు గురైన రకుల్ మీడియాని ఈ విషయంలో నియంత్రించండి అంటూ ఢిల్లీ హై కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. రకుల్ పిటీషన్ని మంగళవారం విచారణకు స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది.
మీడియా తన క్లైంట్పై అసత్య కథనాల్ని ప్రచారం చేస్తోందని రకుల్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తనని నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన నేపథ్యంలో తను మరింత మంది సెలబ్రిటీల పేర్లు చెప్పానంటూ ప్రచారం జరిగిందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని రకుల్ చెప్పినట్టు తెలిసింది. అంతే కాకుండా తన వ్యక్తగత స్వేచ్ఛని, గౌరవాన్ని కాలరాస్తున్నాయని రకుల్ కోర్టుకు వెల్లడించినట్టు చెబుతున్నారు.
ఇదిలా వుంటే రకుల్ ప్రీత్ సింగ్ ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. వైష్ణవ్తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. 40 పనిదినాల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేశారు.