గ్లామర్ డాల్ పాత్రల్లో నటించే క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ తొలి సారి డీ గ్లామర్ పాత్రలో నటించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సాయిధరమ్తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. వై. రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కేవలం 40 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. ఈ చిత్రంలో వైష్ణవ్తేజ్కు జోడీగా క్రేజీ భామ రకుల్ ప్రీత్సింగ్ నటించనుంది. ఇప్పటికే ఆమెని చిత్ర వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సహజత్వానికి దగ్గరగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. రకుల్ ఓ గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన యువతిగా డీ గ్లామర్ పాత్రలో అత్యంత సహజంగా కనిపించనుందని తెలిసింది. ఈ పాత్ర కోసం రకుల్ పూర్తిగా మేకప్ లేకుండా కనిపించనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్లో జరుగుతున్నట్టు తెలిసింది.