బాలీవుడ్ డ్రగ్స్ వివాదం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా సుశాంత్ మరణం తరువాత డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఈ కేసులో ముందస్తుగా అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ లోని కీలక వ్యక్తులకు సంబంధించిన సమచారాన్ని అందించడంతో ఈ కేసులో నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఇందులో శుక్రవారం రకుల్ తో పాటు దీపిక మేనేజర్ కరిష్మ విచారణకు హాజరయ్యారు.
తాజాగా శనివారం దీపిక ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా దీపికని ఎన్సీబీ బృందం ఐదున్నర గంటల పాటు ఇంటరాగేషన్ చేసినట్టు జాతీయ మీడియా కథనం. ఈ విచారణలో ఎన్సీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు దీపిక సమాధానలు చెప్పినట్టు తెలిసింది. అందులో తన మేనేజర్ కరిష్మా ప్రకాష్తో తను చేసిన డ్రగ్స్ చాట్ని కూడా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్ని సీజ్ చేసినట్టు జాతీయ మీడియా కథనం. ఇదే రోజు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కనూర్ని కూడా ఎన్సీబీ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో తాను సుశాంత్ లోనా వాలా గెస్ట్ హౌస్లో ఇచ్చిన పార్టీకి తను హాజరైన మాట వాస్తవమని అంగీకిరంచిందని , అయితే తాను మాత్రం ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్లు తెలిసింది.