కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్, మాల్స్ను కూడా మూసివేశారు. ఇక తెలుగు రాష్ట్రాలలో మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే కరోనా కేసులు పాజిటివ్గా తేలిన వాళ్ళకు ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అలర్ట్ అయ్యారు . విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల వద్దనే పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4000 మంది ఇంకా పర్యవేక్షణలో ఉన్నారు. వారి రిపోర్ట్స్ రావలసి ఉంది. ఇక తక్కిన రాష్ట్రాల పరిస్థితి ఒక్క సారి చూసినట్లయితే….
ముంబైలో ఇప్పటికే థియేటర్లు, మాల్స్ మూసివేశారు.గోవాలో మార్చి 31వరకు విద్యాసంస్థలకు సెలవులు డిక్లేర్ చేసారు. పర్యాటకుల వీసాల విషయంలో ఇప్పటికే ఆంక్షలు విధించారు. కర్ణాటకలో వారంపాటు మాల్స్, థియేటర్లు, స్కూల్స్, కాలేజీలు బంద్ ప్రకటించారు. బిహార్లో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ చెయ్యగా, ఢిల్లీలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత ప్రకటించారు. రాజస్థాన్లో ఈనెల 30 వరకు; యూపీలో మార్చి 22 వరకు; హర్యానాలో మార్చి 31 వరకూ; కోల్కత్తాలో మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్ మూసివేసారు. అన్ని రకాల సభలు, సమవేశాలు, పబ్లిక్ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ లు, స్పోర్ట్స్ ఈవెంట్ లు, ట్రేడ్ ఫెయిర్ లు, మత సంబంధ కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని, అనుమతులు సైతం ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసారు.